
వనపర్తి, వెలుగు: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు, దౌర్జన్యాల కేసుల్లో తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తప్పు చేసిన వారికి శిక్ష పడాలని, బాధితులకు న్యాయం జరగాలన్నారు. తప్పుడు కేసులు నమోదు చేస్తే విజిలెన్స్ కమిటీ సభ్యులు వారిని ఒప్పించి కేసు ఉపసంహరించుకునేలా చూడాలన్నారు. తప్పుడు కేసులు పెట్టడం, తప్పు చేసినప్పటికీ శిక్ష పడకుండానే బయట రాజీ పడడం వంటి వాటితో చట్టం నీరుగారిపోతుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2023 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 58 ఎస్సీ, 10 ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. బాధితులకు మొదటి విడతలో48 మందికి రూ.2.72 లక్షలు, రెండో విడతలో 25 మందికి రూ.40 లక్షలు పరిహారం అందజేశామని, 21 మందికి పరిహారం మంజూరు కావాల్సి ఉందన్నారు. కమిటీ సభ్యుడు ఎడవల్లి వీరప్ప మాట్లాడుతూ బుడగ జంగం వారిపై దాడులు జరుగుతున్నాయని, ముమ్మాలపల్లి, గోపాల్ పేట మండలం చాకల్ పల్లి లో బెదిరిస్తున్నారని అన్నారు. స్పందించిన కలెక్టర్ వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీఆర్డీవో ఉమాదేవి, డీఏవో గోవింద్ నాయక్, డీఐఈవో అంజయ్య
పాల్గొన్నారు.